అజ్ఞాతవాసి డబ్బులు తిరిగి ఇచ్చేశానంటున్న పవన్ కళ్యాణ్!
పవన్ కళ్యాణ్ చివరగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఆకాశాన్ని తాకే అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అభిమానులని మెప్పించలేక ఈ ఏడాది తొలి పరాజయంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ చిత్రాలకు ఎప్పుడూ భారీస్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతుంది. సినిమా నిరాశ పరచడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. నష్టాలని భర్తీ చేయడానికి పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ ని తిరిగి ఇచ్చేశాడని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. తాను, పవన్ కలసి పాతిక కోట్ల వరకు నష్టాలని భర్తీ చేశామని త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన పార్టీ సమావేశంలో ప్రస్తావించారు. అజ్ఞాతవాసి చిత్రం ఫెయిల్ కావడంతో తన పారితోషకాన్ని వెనక్కు ఇచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం ఇది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.